Ayyadevara Kaleshwara Rao: స్వాతంత్య్ర సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు వర్థంతి...! 1 y ago
స్వాతంత్య్ర సమర యోధుడు..
ఆంధ్ర ప్రదేశ్ మొట్ట మొదటి శాసన సభాపతి..
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమవేత..
అయ్యదేవర కాళేశ్వరరావు వర్థంతి
AP : అయ్యదేవర కాళేశ్వరరావు 1881 జనవరి 22న కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1901లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. తరువాత మద్రాసు విశ్వ విద్యాలయంలో బీఎల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 1906లో... విజయవాడలో న్యాయవాదిగా పని చేశారు. ఆ తరువాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడిపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాల్లో అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో పని చేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాల్లో పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు. కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికంస, చైనా జాతీయోద్యమ చరిత్ర', 'ఈజిప్టు చరిత్రస అనే పుస్తకాలను రచించారు. ఇక ఆ తరువాత రాజకీయ ప్రవేశం చేశారు.
1926, 1937, 1946, 1955 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొంది విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. అదే విధంగా విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా మద్రాసు శాసన సభకు చీఫ్ విప్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1947లో శాసనసభలో బహు భార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టారు.
కాళేశ్వరరావు 1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. మద్యపాన నిషేధ చట్టం, సేల్ ట్యాక్స్, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో తన మేధోశక్తిని, భాషా నైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలు పొందారు.
స్వాతంత్య్ర ఉద్యమం తరువాత 1955లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆంధ్ర రాష్ట్ర తొలి శాసన సభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యారు. 1956 నుంచి 1962 వరకు రాష్ట్ర శాసన సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాసన సభలో అనేక నియమ నిబంధనలు పెట్టి తనదైన ముద్ర వేశారు. 1962 ఫిబ్రవరి 26న తుది శ్వాస విడిచారు.